Contact us

ఇకపై కూడా అతనొక్కడికే డబ్బింగ్ చెబుతాను
డబ్బింగ్..నటన రెండు కళ్లు
 కంచు కంఠంతో అటు డబ్బింగ్ కళలోనూ.. ఇటు మంచి నటనా కౌసల్యంతోనూ ప్రేక్షకుల మదికి దగ్గరైన సినీనటుడు సాయికుమార్ మంగళవారం రాత్రి ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయన శ్రీవారు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి స్వామివారి శేషవస్త్రాన్ని, వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఆలయంలో ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు. అనంతరం ఆయన ‘న్యూస్‌లైన్’తో ముచ్చటించారు. 
 
  మీ సినీప్రవేశం
బాలనటుడిగా 1974లో మొదటి సినిమా దేవుడు చేసిన పెళ్లిలో నటించాను. 1972లో మద్రాసులో మయసభలో మొదటి ప్రదర్శన ఇచ్చాను. 
 
  నటనలో ప్రోత్సహించిందెవరు
 నా తండ్రి పుడిపెర్తి జోగేశ్వర శర్మ (పీజే శర్మ). నాకేకాదు నా కుమారుడు ఆదికి కూడా ఆయనే ఆదర్శం.  
 
  మీరు నటించిన చిత్రాల్లో మీకు నచ్చిన సినిమా
  పోలీస్‌స్టోరీ. అందుకే మళ్లీ అటువంటి సినిమాను తీయాలన్న ఉద్దేంతో ‘పోలీస్‌స్టోరీ-3’ ని తీస్తున్నాం. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
  ప్రస్తుతం మీరు నటిస్తున్న చిత్రాలు
  ఆటోనగర్ సూర్య, గలాట, చిలుకూరి బాలాజీలో నటిస్తున్నా 
 
  మీకు డబ్బింగ్, నటనలో ఏది ఇష్టం  
 ఈ రెండు నాకు రెండు కళ్లు. దేవుడు నాకిచ్చిన వరం గొంతు. నేను సినీ హీరో రాజశేఖర్ ఒక్కడికే డబ్బింగ్ చెబుతున్నాను. ఇకపై కూడా అతనొక్కడికే డబ్బింగ్ చెబుతాను. 
 
  నటనపై మీ అభిప్రాయం
 నటుడిగా పుట్టడం ఒక అదృష్టం. విజయాన్ని పొందడం మరింత అదృష్టం. ఇటీవల ‘ఎవడు’లో నెగిటివ్ రోల్‌లో విలన్‌గా నటించడం చాలా ఆనందంగా ఉంది.
   
  బుల్లితెరవైపు మీరు ఎక్కువ మక్కువ చూపుతున్నట్లున్నారు
  ‘వావ్’ అనే మంచి కిక్ ఇచ్చే గేమ్‌షో చేస్తున్నాను. ఈ షో మంచి గుర్తింపు తెచ్చింది. 
 
 మీ కుమారుడు ఆది గురించి..
 ఆదికి నటన అంటే ఎంతో ఇష్టం. ప్రస్తుతం ‘రఫ్, ప్యార్‌మే పడిపోయా’ సినిమాల్లో బిజీగా ఉన్నాడు. 
 
 నిర్మాతగా మారే అవకాశం ఉందా 
 ప్రస్తుతం ఆ ఆలోచన లేదు. 
 
  యువ నటులకు మీరిచ్చే సలహా 
 ఇష్టపడటంతో పాటు కష్టపడితేనే చిత్రపరిశ్రమలో రాణించవచ్చు.

0 Reviews:

Post a Comment