
ఢిల్లీలో మాదిరిగానే హైదరాబాదులో శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఢిల్లీలో శాంతిభద్రతలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటాయని, హైదరాబాదును కూడా అలాగే చేయాలనే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నామని, పోలీసు కమిషనర్ నేరుగా ల్యూటినెంట్ గవర్నర్కు జవాబుదారీగా ఉంటాడని ఆయన అన్నారు. సిఎన్ఎన్ - ఐబియన్ షో డెవిల్స్ అడ్వొకేట్లో ఆయన ఈ విషయాలు చెప్పారు.
వచ్చే పదేళ్ల పాటు హైదరాబాదు తెలంగాణలో భాగంగా ఉంటుందా, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందా అని అడిగితే పదేళ్ల తర్వాత హైదరాబాదును తెలంగాణలో భాగం చేస్తామని కాంగ్రెసు హామీ ఇస్తూ తీర్మానం చేసిందని, వచ్చే పదేళ్లలో ఆంధ్రకు రాజధానిని ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని ఆయన అన్నారు.
వచ్చే లోకసభ ఎన్నికల్లో పార్టీ అవకాశాలను పెంచుకోవడానికే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నారా అని అడిగితే కాదని చెప్పారు. తాము తెలంగాణ గురించి ఇప్పుడే మాట్లాడడం లేదని, 1950 నుంచి మాట్లాడుతూనే ఉన్నామని అన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై రాజకీయ పార్టీలకు చెందిన అన్ని వర్గాలతో, రాష్ట్ర నాయకులతో విస్తృత స్థాయి సంప్రదింపులు జరిపినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ శానససభ రెండు సందర్భాల్లో తీర్మానం చేసిందని ఆయన అన్నారు.
శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుల రాజీనామాలపై ప్రశ్నించగా, పరిణామాల గురించి తమకు బాగా తెలుసునని, చారిత్రకంగా హామీలు ఇచ్చామని, వాటిని గౌరవించాల్సి ఉందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
0 Reviews:
Post a Comment