Contact us

ఎర్రగడ్డ శ్మశానవాటికలో రేపు ఏఎన్నార్ అంత్యక్రియలు
అక్కినేని నాగేశ్వరరావు అంత్యక్రియాలు గురువారం ఎర్రగడ్డ స్మశానవాటికలో జరగనున్నాయి. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులుఎ తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు గత రాత్రి అస్వస్థతకు గురి కావటంతో వెంటనే ఆయన్ని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎన్నార్ మృతి చెందారు. ఈరోజు సాయంత్రం వరకూ అభిమానుల సందర్శనార్థం అక్కినేని పార్థీవ దేహాన్ని అన్నపూర్ణ స్టూడియోలో ఉంచుతారు. కాగా అక్కినేని నివాసంలో  ఉంచిన ఆయన భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.


అక్కినేని కుటుంబానికి ప్రముఖుల పరామర్శ
హైదరాబాద్ : వైఎస్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆమెతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు సుచరిత, శోభా నాగిరెడ్డి ఉన్నారు. కాగా ఎన్నాఆర్ మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ ఓ ప్రకటనలో ప్రగాఢ సానుభూతి వ్యక్తి చేశారు.

 మరోవైపు  అక్కినేని నాగేశ్వరరావు మృతితో సినిమా పరిశ్రమ దిగ్ర్భాంతికి గురైంది. ఆయన మరణం గురించి తెలియగానే పరిశ్రమకు చెందిన సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలపడానికి ఆయన నివాసానికి క్యూ కట్టారు. అక్కినేనితో వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు... ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.

కృష్ణ, జమున, డి.రామానాయుడు, విబి రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, దాసరి నారాయణరావు, తమ్మారెడ్డి భరద్వాజ, మోహన్ బాబు, డాక్టర్ సి. నారాయణరెడ్డి, పరుచూరి బ్రదర్స్, చలపతిరావు, హరికృష్ణ, కళ్యాణ్ రామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కృష్ణంరాజు దంపతులు, జగపతి బాబు, రాజీవ్ కనకాల, సురేష్ కొండేటి, దగ్గుబాటి సురేష్ బాబు, జయసుధ, నితిన్ కపూర్,  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, నన్నపనేని రాజకుమారి, జూలకంటి రంగారెడ్డి, రాజేంద్రప్రాసాద్, నాదెండ్ల మనోహర్, జయప్రకాష్ నారాయణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తదితరులు అక్కినేని పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
 
 శిఖరం ఒరిగింది... అక్కినేని అస్తమించారు...
 ప్రతి తెలుగువాడికీ శరాఘాతం ఈ మాట. కానీ తప్పదు. గుండెను దిటవు చేసుకోక తప్పదు. ‘కన్నీళ్లకే బతికించే శక్తి ఉంటే.. అవి ఏనాడో కరువైపోయేవి’ అన్నాడు ఆయనే ఓ సినిమాలో. అందుకని వాటిని ఆపగలమా? కట్టలుతెగిన  విషాదానికి అడ్డుకట్ట వేయగలమా? ఏడు దశాబ్దాల పాటు తన నటనతో రంజిపంజేసి.. ప్రేక్షకుల్ని రుణగ్రస్తుణ్ణి చేశాడాయన. ఆయన పంచిన ఆనందాన్ని మరిచిపోవడం తేలికైన విషయం కానేకాదు. మనిషి అనేవాడు ఎలా బతకాలో ఆయన పాత్రలు చెప్పాయి. ఎలా బతక్కూడదో ఆయన పాత్రలు చెప్పాయి. సంఘాన్ని సంస్కరించేంత గొప్ప పాత్రలు పోషించిన ఘనత ఆయనది.  ఈ వయసులో కూడా మూడు తరాలకు చెందిన తన కుటుంబ సభ్యులతో కలిసి నటించిన నవ యువకుడు అక్కినేని.  కుటుంబసభ్యులతో కలిసి ఆయన నటించిన చివరి సినిమా ‘మనం’ త్వరలోనే విడుదల కానుంది.

 దటీజ్ అక్కినేని...
 ఎన్నెన్ని ప్రేమ కావ్యాలు, ఎన్నెన్ని కుటుంబ గాధలు, ఎన్నెన్ని ఆధ్యాత్మికానందాలు, ఎన్నెన్ని పురాణపాత్రలు.. ఒకానొక దశలో తెరపై మానవ బంధాలన్నింటిలో అక్కినేనినే చూసుకుంది ప్రేక్షకలోకం. ప్రేమికుడంటే అక్కినేని. కొడుకంటే అక్కినేని. భర్త, అన్న, తమ్ముడు, మరిది, తండ్రి, తాత.. ఇలా అన్ని బంధాల్లో అక్కినేనినే చూసుకున్నారు. తెలుగుతెరపై అజరామరమైన సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలతో రంజింపజేసి ‘నటసామ్రాట్’ బిరుదుని సార్థకం చేసుకున్నారాయన...
 పట్టుదలకు పర్యాయపదం అక్కినేని...
 కార్యదీక్షను ఇంటిపేరుగా మార్చుకున్న నిత్య కృషీవలుడు అక్కినేని..
 నిరంతరం నటననే శ్వాసించిన అభినయ నటరాజు అక్కినేని...
 చెన్నపట్టణంలో వేళ్లూనుకుపోయిన.. మన సినిమాను తెలుగునేలకు తరలించిన అభినవ భగీరథుడు అక్కినేని...
 82 ఏళ్ల తెలుగు సినిమాతో.. 72ఏళ్ల పాటు ప్రయాణించి తెలుగు సినీ సహోదరుడు అక్కినేని...
 అక్కినేని జీవన ప్రస్థానంలో ఎన్నో మలుపులు. ఎన్నో ఒడిదుడుకులు.
 హీరోగా నిలదొక్కుకోడానికి ఆయన చేసిన సాహసాలు ఎన్నో. విమర్శించిన వారితోనే పొగిడించుకున్న దీక్షాదక్షుడు అక్కినేని
 అక్కినేని బాల్యం
 కృష్ణాజిల్లా గుడివాడ తాలూకాలోని వెంకటరాఘవపురంలో (ప్రస్తుతం రామాపూరం) 1924 సెప్టెంబర్ 20న పున్నమ్మ, వెంకటరత్నం దంపతులకు జన్మించారు అక్కినేని నాగేశ్వరరావు. నిజానికి అక్కినేని కుటుంబంలో కళాకారులు లేరు. కళ అనేది దైవదత్తంగా ఆయనకు అబ్బింది. చిన్నతనం నుంచే నాటకల్లో వేషాలు వేసేవారాయన. అక్కినేని ధరించిన తొలి పాత్ర ‘నారదుడు’. వెంకటరాఘవపురంలో పిల్లలందరూ కలిసి వేసిన ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో పట్టుబట్టి అక్కినేనితో నారద పాత్రను వేయించారు. కారణం ఆ ఊళ్లో ఆయన మంచి పాటగాడు కావడమే. ఆ తర్వాత ఏఎన్నార్ నటించిన పాత్ర చంద్రమంతి. తర్వాత ‘కనకతార’ అనే నాటకంలో తారగా నటించారు. అప్పట్నుంచీ నాటకాల్లో స్త్రీ వేషాలు విరివిగా రావడం మొదలయ్యాయి. ‘సత్యహరిశ్చంద్ర’ నాటకంలో మాతంగకన్య, ‘భక్తకుచేల’ నాటకంలో మోహిని, ‘సారంగధర’ నాటకంలో చెలికత్తె పాత్ర ఇలా ఖాళీ లేకుండా నాటకాలు వేస్తూ ఉండేవారు. రంగస్థల కళాకారునిగా అక్కినేని తొలి పారితోషికం అర్థరూపాయి. ఆ స్థాయి నుంచి అయిదొందలు తీసుకునే స్థాయికి ఎదిగారు. అమ్మ, అన్న ప్రోత్సాహం వల్లే రంగస్థలంపై రాణించగలిగానని చెబుతూ ఉండేవారు అక్కినేని. అప్పట్లో అక్కినేని కుటుంబానికి ఓ పాతిక ఎకరాలు పొలం ఉండేది. అందుకే ఆయన్ను అందరూ చిన్నదొర అంటుండేవారు. కలిగిన కుటుంబంలో పుట్టినా... డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారాయన. ప్రతి ఏడాదీ కుప్పనూర్పిళ్ల సమయంలో... పొలంలో కష్టపడితే ఓ పావలా వచ్చేది. ఆ డబ్బుతో దాపుడు చొక్కా కొనుక్కునేవారు. భజనల్లో గెంతడాలు, కోలాటాలు ఆయనకు చాలా ఇష్టం. ఆ విధంగా చిన్నతనం నుంచే అక్కినేనికి తాళజ్ఞానం అలవడింది. ఇప్పుడు నడుస్తున్న డాన్స్‌ల ట్రెండ్‌కి బీజం అక్కడ పడిందనమాట.
 
 విఫలమైన తొలి సినీ అవకాశం
 1940లో వచ్చిన ‘ధర్మపత్ని’ అక్కినేని తొలి సినిమా అని అందరికీ తెలిసిందే. కానీ నిజానికి ఆ సినిమాకంటే ముందే అక్కినేనికి సినీ అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు ‘తల్లిప్రేమ’. జ్యోతి సిన్హా దర్శకుడు. కథ రిత్యా అందులో ఓ పధ్నాలుగేళ్ల కుర్రాడి పాత్ర ఉంది. దానికి అక్కినేనిని ఎంపిక చేసి మద్రాసు తీసుకెళ్లారు ప్రముఖ నిర్మాత కడారు నాగభూషణం. షూటింగ్ జరుగుతోంది. కానీ ఆయన పాత్ర  మాత్రం రావడం లేదు. అలా నాలుగు నెలలు అక్కడే ఉన్నారు అక్కినేని. తన పాత్ర ఎప్పుడొస్తుందో అని ఆయన ఎదురు చూస్తున్న సమయంలో... కథలో లెంగ్త్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ పాత్రను తీసేశామని బాంబు పేల్చారు. నాలుగు నెలలు అక్కడే ఉన్నందుకు వంద రూపాయలు ఇచ్చి అక్కినేనిని పంపించారు. కానీ ఆయన వెంకటరాఘవపురానికి నిరాశతో రాలేదు. సీఎస్‌ఆర్ ఆంజనేయశాస్త్రి, కన్నాంబ లాంటి మేటి నటుల్ని చూశానని ఆనందంతో ఆయన వెనుదిరిగారు. ‘దేవదాసు’ నిర్మాత డీఎల్ నారాయణను అక్కినేని తొలిసారి కలిసింది అప్పుడే. ఆ టైమ్‌లో డీఎల్ ప్రొడక్షన్ మేనేజర్. ఉత్తరకాలంలో అక్కినేని హీరో అవుతారని, ఆయనతో డీఎల్ ‘దేవదాసు’ లాంటి అజరామర ప్రేమ కావ్యాన్ని తీస్తారనేది కాలానికి మాత్రమే తెలిసిన భవిష్యవాణి.
 
 తొలిసినిమా ‘ధర్మపత్ని’
 పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘ధర్మపత్ని’ సినిమా షూటింగ్ కొల్హాపూరులో మొదలైంది. అందులోని ఓ పిల్లాడి వేషం కోసం అక్కినేని తీసుకున్నారు. అయితే... అప్పటికే ఆయన వయసు 16 ఏళ్లు. దాంతో... ఆ వేషానికి పెద్దవాడైపోయాడనే ఉద్దేశంతో అక్కినేనికి గుంపులో గోవింద లాంటి వేషం ఇచ్చారు పుల్లయ్య. ఆ సినిమాలోని పిల్లలపై తీసిన ఓ పాటలో అక్కినేని కనిపిస్తారు. అందులో అక్కినేనికి ఒక్క డైలాగు లేకపోయినా... తొలిసారి తెరపై కనిపించారు. సో... ఆ విధంగా చూసుకుంటే అక్కినేని తొలి సినిమా ధర్మపత్నే.
 
 నట ప్రస్థానం...
 ముగ్గురు మరాఠీలు(1946) మాయాలోకం(1945) చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న అక్కినేనికి ‘బాలరాజు’(1948) చిత్రం స్టార్‌ని చేసింది. ఆ వెంటనే వచ్చిన మరో జానపదం ‘కీలుగుర్రం’(1949) ఆయన్ను నంబర్‌వన్‌ని చేసింది. దేవదాసు(1953),  అనార్కలి(1955), బాటసారి(1961), మూగమనసులు(1964), మనసేమందిరం,(1966), ప్రేమనగర్(1971), దేవదాసు పళ్లీపుట్టాడు(1978), ప్రేమాభిషేకం(1981), ప్రేమమందిరం(1981), అమరజీవి(1983)... ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నో ప్రేమకథలు. దక్షిణాదిన ఇన్ని ప్రేమకథల్లో నటించిన హీరో మరొకరు లేరు. అందులోనూ పాత్ర పాత్రకూ వ్యత్యాసం. అక్కినేని భక్తునిగా పేరుతెచ్చిన చిత్రాలు విప్రనారాయణ(1954), భక్తజయదేవ(1961), భక్తతుకారం(1973), మహాకవి క్షేత్రయ్య(1976), చక్రధారి(1977), శ్రీరామదాసు(2006). ఇక అక్కినేని నటించిన సాంఘిక చిత్రాల గురించి చెప్పడమంటే సాహసమే!
 
 అక్కినేని నాగేశ్వరరావు నాలుగో తరగతితోనే చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆయన యంగ్ హీరోగా రాణిస్తున్న రోజుల్లో చాలామంది ఇంగ్లీష్ లో మాట్లాడుకునేవారు. దాంతో అక్కినేనికి ఇంగ్లీష్ అర్ధమయ్యేది కాదు. ఓ ఆహ్వానం మేరకు ఆయన శ్రీలంక వెళ్లినప్పుడు అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడితే.. అక్కినేని మాత్రం తమిళంతో మేనేజ్ చేశారు.
ఆ తర్వాత పట్టుదలతో ఆయన ఆంగ్లం నేర్చుకున్నారు. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే స్థాయికి చేరుకున్నారు.  ది హిందూ దినపత్రికను క్రమం తప్పకుండా చదువుతూ ఇంగ్లీష్ లో ప్రావీణ్యం సంపాదించారు.  ప్రేక్షకులే దేవుళ్ళు అంటూ కొలిచే ఆయన నటనలో తానెప్పుడూ నిత్యవిద్యార్థినే అని వినయంగా చెబుతుండేవారు.
 ఎప్పుడూ నిండుగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉండే అక్కినేని నాగేశ్వరరావు చిట్టచివరి క్షణాల్లో కూడా అందరితో సంతోషంగానే మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, అగ్రనటుడు నాగార్జున తెలిపారు. కేర్ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతూ మరణించిన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయాన్ని ఉదయం 9.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్ ప్రాంగణంలో ఉంచుతామని, ఆయనను కడసారి చూసేందుకు అభిమానులు తప్పక స్టూడియోకు రావాలని నాగార్జున కోరారు.

కాగా నాగేశ్వరరావుకు ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని నిర్మాతగా ఉండగా, రెండో కుమారుడు నాగార్జున హీరో. సత్యవతి, నాగ సుశీల, సరోజ అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మనవలు సుమంత్, సుశాంత్, నాగచైతన్య ఇప్పటికే సినిమాలలో ఉండగా, ఆఖరి మనవడు అఖిల్ అక్కినేని కూడా త్వరలోనే సినీరంగ ప్రవేశం చేస్తారని అంటున్నారు.

అక్కినేని నాగేశ్వరరావును చివరిసారిగా చూడలేకపోయానన్న బాధ తనకు జీవితాంతం మిగిలిపోతుందని సీనియర్ నటుడు మురళీ మోహన్ అన్నారు. వారం రోజుల క్రితం ఆయనను చూసేందుకు వెళదామనుకున్నానని, అయితే అక్కినేని నీరసంగా ఉండటంతో వాయిదా పడిందన్నారు. ఆ తర్వాత తాను అనుకోకుండా రాజమండ్రి వెళ్లాల్సి ఉండటంతో అక్కినేనిని కలుసుకోలేక పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎన్నార్ తో ఆత్మీయ అనుబంధం ఉందని, ఆయన మరణంతో తాను కుటుంబ పెద్దను పోగొట్టుకున్నంత బాధగా ఉందని మురళీ మోహన్ అన్నారు.

అక్కినేని వందేళ్లు బతకాలని తాను అన్నప్పుడల్లా.... ఎన్నేళ్లు బ్రతికామన్నది కాదని... ఎంత ఆరోగ్యంగా బతికామన్నదే ముఖ్యమనేవారని... ఆ స్మృతులను మురళీమోహన్ ఈ సందర్భంగా తలుచుకున్నారు. తనకు క్యాన్సర్ సోకిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన గుండె ధైర్యం ఉన్న మనిషి అని.... అనంతరం ఆపరేషన్ చేయించుకున్నారని, మరో రెండు మూడేళ్లు ఆరోగ్యంగా ఉంటారనుకున్నానని... ఇంతలోనే ఆయనకు మరణం ముంచుకు వచ్చిందని అన్నారు.

0 Reviews:

Post a Comment